Commentary

రాముడా -రాజ్యాధికారమా ? రాముడే యన్న మేరునగధీరుడు కళ్యాణ్ సింగ్

Sandeep Balakrishna, Translator: రామేశ్వరం జి

Note: This is the Telugu translation of the original English article linked below.

మీరు చరిత్రకు విద్యార్థి కాకపోతే కాలాన్ని స్నేహితుడిగా భావించలేరు , ఎందుచేతనంటే వ్యక్తులు - ఘటనలు ఏది ఎక్కడవుండాలో నిర్దేశించేది, సమదృష్టి ప్రసాదించేదీ కాలమే - ఉచితంగా గత ఆరు సంవత్సరాల చరిత్ర గమనంలో అబ్రహాము మూలస్థానముగా ఉదయించిన మతాల తత్త్వము, సెక్యులరిజం పేరుతో రాజకీయాల్లో ఇమిడిపోయి,సనాతన ధర్మ నిర్మూలనమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానఆశయముకలిగినటువంటివి.

అత్యున్నత స్థాయిలో సుప్రీం కోర్టు వాదనలు అయోధ్య విషయంలో మొదలైనవో లేదో ముగిసి పోయాయి, 29 జనవరి 2019 కి వాయిదా పడ్డాయి , న్యాయమూర్తి యు. యు. లలిత్ బెంచ్ నుండి వైదొలగడమే అందుకు కారణం.

ఎందుచేత ?

న్యాయమూర్తి యు. యు. లలిత్ 1994 లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరఫున వాదించారు. కళ్యాణ్ సింగ్ దీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఈ ధీమంతుడు, వెన్నుచూపని రామభక్తునిగా హిందువుల హృదయాలలో చోటుచేసుకున్నారు.

రామజన్మభూమి ఉద్యమాన్ని ముందుండి నడిపి ఉద్యమ ప్రతీకగా నిలిచిన శ్రీ ఎల్ కె అడ్వాణీ , హిందూ వ్యతిరేక శక్తులు, భారత వ్యతిరేక సెక్యులర్ గూండాలకు తలవంచి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజును ' నా జీవితంలో దుఃఖాతి దుఃఖమయ దినమ'ని అభివర్ణించినా , ఏనాడూ పూర్తి మద్దతు ఇవ్వక 'భీష్మ ధృతరాష్ట్రుల ఒకే రూపమా' అన్నట్లు మసీదు కూలిన తరుణంలో ఒక అటల్ బిహారి వాజపేయి ప్రవర్తించినా, ఒక సుష్మా స్వరాజ్ కు ఒక చారిత్రాత్మక ఘటన చెక్కు కన్నా ఎక్కువకాకపోయినా , నిశ్చయాత్ముడై , తొణకక నిలిచిన ధీరుడు ఒకే ఒక్కడు - కళ్యాణ్ సింగ్.

శ్రీరామ పరీక్ష ?

ఇక్ష్వాకుకులతిలకుని సేవలో తన పదవిని సంతోషంతో త్యాగం చేసి రాముని అడుగుజాడల్లో నడిచిన ఏకైక ప్రముఖ భాజపా నాయకుడు - ఒకే ఒక్కడు - కళ్యాణ్ సింగ్. భగవానుడు తన నిజమైన భక్తుడిని అనేక శోధనలకు గురిచేస్తాడని భక్తిమార్గ అనుయాయులు నమ్ముతారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది అప్రస్తుతం.

కానీ కళ్యాణ్ సింగ్ విషయంలో అది నిజం. దూసుకుపోతున్న రాజకీయ ప్రస్థానంలో కూడా రామచంద్రుని పట్ల ఆయన అంకితభావం నచ్చని తన స్వంత పార్టీలోని ప్రబల రాజకీయ శక్తులు ఢిల్లీ నుండి మద్దతుతో ఆయనను అణగద్రొక్కాయి.

ఈ చరిత్రలోకి పోకుండా కారకులైన ఇద్దరి పేర్లు చెప్తే చాలు : కల్రాజ్మిశ్రా , లాల్జీటండన్.

2009 నాటికి ఏకాకియై తన రాజకీయ ప్రతిస్పర్థితో ఒప్పందం చేసుకోవలసిన పరిస్థితి కలిగింది. అటువంటి అవమాన స్థితి లో కూడా బాబ్రీ మసీదు కూల్చివేతకు క్షమాపణ చెప్పలేదు . 4 ఫిబ్రవరి 2009 లో ఆయన ఇచ్చిన వాఙ్మూలం మార్మికమైనది .

బాబ్రీ మసీదు కూల్చివేతకు నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను ...ఆ కారణంగానే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చాను. ఎవరుఅనుసరించే మత విషయంలోవారుగర్వపడడం వారి హక్కు. ఇస్లాం గురించి గర్వపడే ,హక్కు ప్రతి ముస్లిముకుఉన్నట్లుగానే , అదే హక్కు ప్రతి హిందువుకుకూడా ఉన్నది.

కళ్యాణ్ సింగ్ నైతిక బాధ్యతను వహించారు తప్ప క్షమాపణ చెప్పలేదని గుర్తించాలి

రెండు నెలల తరువాత 2009 లో జరిగిన లోక సభ ఎన్నికలలో సమాజవాది పార్టీ సహకారంతో స్వతంత్ర్య అభ్యర్థిగా ఐటా నుండి పోటీ చేశారు. 2009 ఏప్రిల్ 17న అలీగఢ్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో ఇలా చెప్పారని హిందుస్తాన్ టైమ్స్ వ్రాసింది:

బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 16 సంవత్సరాలు దాటింది, అని ప్రస్తావించిన మాజీ ముఖ్యమంత్రి , 16 వ శతాబ్దపు ఆ కట్టడాన్ని కూల్చకుండా ఆపాలని ప్రయత్నం చేశానని చెప్పారుగాని, ఆపలేకపోయినందుకు క్షమాపణలు చెప్పలేదు .

మరోసారి గుర్తించండి. కళ్యాణ్ సింగ్ క్షమాపణ చెప్పలేదు

ఇది మహాపురుషుల లక్షణం. భాజపాకు ఆ తరువాత కళ్యాణ్ సింగ్ తో ఉపయోగము ఉండకపోవచ్చు, అందుకే నామమాత్రమైన పదవిలో గవర్నర్ గా రాజస్థాన్ పంపి ఉండవచ్చు. 87 సంవత్సరాల వయస్సులో ఒకప్పటి వేగము చురుకుతనము లేకపోవచ్చు, కానీ రామచంద్రుని భక్తునిగా ఆయన స్థాయి శిఖరాయ మానమే .

మళ్ళీ గతం లోకి వెళ్ళితే, కళ్యాణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 24 జూన్ 1991 లో పదవీ స్వీకారం చేశారు. వెంటనే ఆయన తన లక్ష్యాన్ని మరువకుండా రంగంలోకి దిగారు. వి.హిం.ప , ఆరెస్సెస్, బజరంగ దళ్ మరియు ఇతర జాతీయ సాంస్కృతిక సంస్థలు అయోధ్యలో డిసెంబరు 6, 1992 న కరసేవ చేయాలని నిర్ణయం ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా సెక్యులర్ భారత విచ్ఛిన్న శక్తుల సమూహం భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. వాళ్ళు దాదాపు విజయం సాధించారు. ఏనిమిషమైనా కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసే సూచనలు కనబడ్డాయి. ప్రధాని పీ వీ నరసింహారావు ఊహించని పరిణామాలను ఎదుర్కొన వలసి వచ్చింది.

కళ్యాణ్ సింగ్ సుప్రీం కోర్టు కు బాబ్రీ నిర్మాణాన్ని ఎలాగైనా రక్షిస్తానని వాఙ్మూలం ఇచ్చారు. వెనక్కుతిరిగిచూస్తే ఇది అద్భుతమైన వ్యూహం లాగా తోస్తుంది. దీంతో రెండు ప్రయోజనాలు సమకూడాయి. తన ప్రభుత్వం రద్దు కాకుండా రక్షించబడింది . కరసేవకు సౌలభ్యం లభించింది. డిసెంబరు 6 , 1992 న ఏం జరిగిందో- చర్వితచర్వణం కావున మళ్ళీ చెప్పవలసిన పని లేదు.

క్లుప్తంగా ఇదీ జరిగిన కథ, రాములవారికోసమై తన ఉన్నత పదవిని వదులుకున్నఒక త్యాగశీలుని కథ. ఒక రామభక్తుని కథ. తను పదవినుండి తప్పుకున్నా, రామసేవలో త్యాగాలు చేసి , బాధలను అనుభవించిన లక్షలాది హిందువుల వెన్నుదన్నుగా నిలిచిన ఒకే ఒక్కడు - కళ్యాణ్ సింగ్.

రాముడినితమఒక పబ్బం గడుపుకునేందుకు పార్టీకి ఒక' ప్రతీక'గా మార్చినటువంటితరువాతితరంఅసంఖ్యాక భాజపా "నాయకుల"తో ,ఈమేరునగధీరుడైన వ్యక్తినిపోల్చగలమా ?బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత అక్కడే ఒక తాత్కాలిక రామమందిరం ఏర్పాటైంది. కళ్యాణ్ సింగ్ కూల్చివేతను ఆపలేకపోయినందుకు తన అశక్తతను వ్యక్తం చేస్తూ, నైతిక బాధ్యతను స్వీకరించి పదవీత్యాగం చేశారు.

శ్రీరాముడికి అధ్బుతమైన ఆలయ నిర్మాణం జరగాలని కోరిన కళ్యాణ సింగ్ ఆలోచనలో డోలాయమాన స్థితి లేదు, అస్పష్టత లేదు . దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇతర రాజకీయ నాయకులలాగా కాలయాపన చేసి ముఖ్యమంత్రిగా హంగు ఆర్భాటాలతో సుఖంగా నడిచినంత కాలం నడపవచ్చు కాని ,ఒకటిన్నర సంవత్సరాలలోనే పదవీ త్యాగానికి సిద్ధమై ఉన్నాడు. సుప్రీం కోర్టుకుబాబ్రీ మసీదును రక్షిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఎటువంటి అవాంతర పరిస్థితిలోనూ కరసేవకుల మీద కాల్పులు జరపకూడదు అని పోలీస్ శాఖ ను ఆదేశించాడు. ఈ కారణం చేతనే కళ్యాణ్ సింగ్ ను సుప్రీం కోర్టుసహ కుట్రదారునిగా వారి విచారణలో పేర్కొన్నది.

కళ్యాణ్ సింగ్ కడగండ్లు అంతటితో ముగియలేదు. మళ్ళీ సుప్రీం కోర్టే ఒక రోజు జైలు శిక్ష , వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. విధి విలాసం ఎంత విచిత్రమో చూడండి అయోధ్య ఉద్యమం, అటల్ బిహారీ వాజపేయి ని ప్రధానమంత్రిని చేస్తే లాల్ కృష్ణ అడ్వాణీ ని ఉప ప్రధానమంత్రిని చేసింది ; కళ్యాణ్ సింగ్ ను కటకటాల పాలు చేసింది.

1998 లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన భాజపా అనతికాలంలోనే అరణ్యవాస స్థితిని ఎదుర్కొన్నది. పార్టీలో అంతర్గత కలహాలు, గోతులు త్రవ్వే వైషమ్యాలు నేటి కాంగ్రెస్ కన్నా అధమంగా ఉండేవి. 1998 - 2004 మధ్య భాజపా శ్రీరాముణ్ణి , అయోధ్యను విస్మరించింది , రామభక్తులను దూరంగా ఉంచింది. దొక్కలెండిన వాడికి విందుభోజనం లభించినట్లు తలకెక్కిన అధికార మదము తో నిస్వార్థం తో పనిచేసే కార్యకర్తలను, పార్టీ బంట్లను ఖాతరు చేయలేదు. ప్రమోద్ మహాజన్ , వెంకయ్య నాయుడు వంటి నాయకుల ఇష్టారాజ్యం నడిచింది. అందుకు అతి దీనంగా ఓడిపోయి 2004 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నది.

నిబద్ధత మరవని నాయకుడు

ఎన్ని అవమానాలెదురైనా, గుర్తింపు లేని పరిస్థితి వచ్చినా, పార్టీ తిరస్కారానికి గురైనా కళ్యాణ్ సింగ్ అయోధ్య విషయంలో తన నిబద్ధత సడలించలేదు , రామభక్తిని వదలలేదు. ఒక క్షమాపణతో తన సహ నాయకుల వలె ప్రవర్తించి ఉండవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ తన వ్యక్తిగతమైన సాధక బాధకాలు, నిరాశా నిస్పృహలు తన రామభక్తికి ఆటంకాలు కాలేదు. అటువంటి నిస్వార్థ వ్యక్తులు , అంకితభావంతో పనిచేసే మనుషులు ఎందరో నేటికీ భాజపాలో ఉన్నారు.

శ్రీరాముణ్ణి భాజపా పరిత్యజించిందా , కాకపోవచ్చు, కానీ స్పష్టంగా తెలిసే దారి లేదు అయోధ్య "విషయం" ఈరోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చినందున , మళ్ళీ అయోధ్య విషయంలో , శ్రీరాముని విషయంలో ఆ మహవ్యక్తి స్వార్థ రహిత నిబద్ధత ను గురించిన జ్ఞాపకాలు మదిలో జాగృతమయ్యాయి.

ఇక్కడ ఒక్క విషయం మనవి చేసి మీ నుండి సెలవు తీసుకుంటాను. డిసెంబరు 2 , 2004 న లైబర్హాన్ కమిషన్ ముందు కళ్యాణ్ సింగ్ 27 పేజీల ప్రమాణ పత్రాన్నిదాఖలు చేశారు . చెప్పదలిచిన విషయాన్ని సరళంగా, కచ్చితంగా, సూటిగా, సందిగ్ధత లేని భాషలో తెలియజేశారు. అది ఆయన వ్యక్తిత్వానికి నిబద్ధతకు దర్పణం లాంటిది. అది ఒక దైవ ఘటన అని అభివర్ణిస్తూ ఇలా చెప్పారు:

.... ఆ రోజు జరిగిన సంఘటనలో ఈ సాక్షికి సంతాపము కాని , పశ్చాత్తాపము కాని , బాధ కాని, విచారం గాని లేవు. ..... (భవిష్యత్తు లో ) చరిత్రకారులు రామభక్తులు , దేశభక్తులు - బానిసత్వానికి గుర్తుగా మచ్చగా నిలిచిన ఆ కట్టడాన్ని కూల్చివేశారు. వివాస్పదమైన కట్టడము రామాలయమే, ఎల్లప్పుడూ.

|| శ్రీరామాజయం ||

The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.